“నారప్ప” డిజిటల్ రిలీజ్ పై వెంకీ రియాక్షన్ !

వెంకీ అభిమానులు విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం “నారప్ప”. అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ పామ్ లో రిలీజ్ అవుతుందని ప్రకటించి అందరికీ షాకిచ్చారు మేకర్స్. అప్పటి నుంచి సినిమాను ఓటిటిలో విడుదల చేయడం విషయమై మనసు మార్చుకోవాలంటూ వెంకీని రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. మరోవైపు వెంకటేష్ నటించిన “దృశ్యం-2, నారప్ప” రెండు చిత్రాలను కూడా నేరుగా ఓటిటి వేదికలపై స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు సురేష్ బాబు. “దృశ్యం-2” వచ్చే నెలలో డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. నిన్న ‘నారప్ప’ రిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. “నారప్ప” జూలై 20 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రదర్శించబడుతుంది.

అయితే తాజాగా వెంకీ తన అభిమానుల నుంచి వస్తున్న రిక్వెస్ట్ లపై స్పందించారు. “నా శ్రేయోభిలాషులు, అభిమానులందరూ “నారప్ప”ను చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాకు, చిత్రబృందానికి మీపై చాలా ప్రేమ ఉంది. అది ఇంకా పెరుగుతూనే ఉంటుందని మేము నమ్ముతున్నాము. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కంఫర్ట్ అండ్ సేఫ్టీగా మీ ప్రియమైన వారితో చూడండి. “నారప్ప” కొన్ని రోజుల్లో ఒక క్లిక్ దూరంలో ఉంది. జూలై 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోంది” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అభిమానులను, వారి కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెంకటేష్ చెప్పుకొచ్చాడు. మరి ఇప్పటికైనా ఆయన ఫ్యాన్స్ కూల్ అవుతారేమో చూడాలి.