ఏపి రాజ‌ధానుల‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

కేంద్రం ఏపీ రాజధాని విషయంలో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తూ మరోసారి క్లారిటీ ఇచ్చింది. రాజధాని అంశంపై నిర్ణయo రాష్ట్రానిదే.. ఈ విషయంలో తమ పాత్ర లేదని తేల్చి చెప్పింది. బుధవారం హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ సీఆర్డీఏ రద్దు చేస్తూ కొత్త చట్టానికి రూపకల్పన చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించలేదని.. ఈ వ్యవహారం కూడా పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని తెలిపింది. కేంద్రం కల్పించు కోలేదని చెప్పింది.

పాలనా వికేంద్రకరణ చట్టం, సీఆర్డీఏ రద్దు చట్టాన్ని సవాల్‌ చేస్తూ రాజధాని ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోం శాఖ అండర్‌ సెక్రటరీ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. అంతేకాదు ఇటీవల విభజన చట్టం, కేంద్రం ఇచ్చిన హామీలకు సంబంధించి హైకోర్టులో పిల్ దాఖలుకాగా.. ఈ కేసులోనూ కేంద్రం రాజధాని విషయంలో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని అంశం తమ పరిధిలో లేదని క్లారిటీ ఇచ్చింది.