సీఎం జగన్ అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ భేటీ
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. నవరత్నాల పథకాల అమలు, జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్ల ఏర్పాటుపై కేబినెట్లో చర్చిస్తున్నట్లు సమాచారం.
అలాగే, నెల 10న అమలు చేయనున్న వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకంపై కూడా చర్చిస్తున్నారు. ఏపీలో పోలవరం నిర్వాసితుల ఆర్అండ్ఆర్ చెల్లింపులకు ఈ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ పై కూడా నిర్ణయాలు తీసుకుని కేబినెట్ ఆమోదం తెలపనుంది.
అలాగే, ధార్మిక పరిషత్ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటుపై చట్ట సవరణకు ఆమోదం తెలపనుంది. . రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి విధానం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల రివైజ్డ్ అంచనాలకు ఆమోద ముద్ర వేయనుంది. వీటితో పాటు మరిన్ని కీలక అంశాలపై కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం వుంది.