‘రిపబ్లిక్’ నుంచి ‘జోర్ సే’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!

సాయితేజ్ – దేవ కట్టా కాంబినేషన్లో ‘రిపబ్లిక్’ సినిమా రూపొందింది. భగవాన్ – పుల్లారావు కలసి నిర్మించిన ఈ సినిమా, సరైన విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తోంది. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి, ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

“సూడబోదుమా .. ఆడబోదుమా .. సెయ్యి సెయ్యి కలిపి సేరబోదుమా .. ” అంటూ ఈ పాట సాగుతోంది. జాతర వాతావరణంలో జనంతో కలిసి హీరో ఆడిపాడే పాటగా ఇది కనిపిస్తుంది. పాటలో హీరోతో పాటు హీరోయిన్ కి కూడా చోటు ఉంది. జానపద బాణీలో ఊపుతో హుషారుగా ఈ పాట నడుస్తోంది.

ఆంధ్రలో విశేషంగా జరిగే పెద్దింట్లమ్మ జాతర నేపథ్యంలో సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ బావుంది .. యూత్ పై మంచి ఉత్సాహభరితమైన స్టెప్స్ ను ఆయన కంపోజ్ చేశాడు. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న సాయితేజ్ ముచ్చట ఈ సినిమా తీరుస్తుందేమో చూడాలి.