CM Jagan: మహిళా సాధికారతకు సహకారించండి: బ్యాంకర్లకు సిఎం జగన్‌ విజ్ఞప్తి

మహిళా సాధికారత కోసం బ్యాంకర్లు సహకరించాలని ఎపి సిఎం వైఎస జగన్‌మోహన్‌ రెడ్డి కోరారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో సిఎం జగన్‌ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగించిందని, పంపిణీ వ్యవస్థ, ఉపాధి మార్గాలు దెబ్బతిన్నాయని తెలిపారు. బ్యాంకర్ల సహకారంతో రాష్ట్రం సమర్థ పనితీరు కనబరిచిందని వెల్లడించారు. 2020-21లో దేశ జిడిపి 7.25 శాతం తగ్గితే.. ఎపిలో 2.58 శాతం మాత్రమే తగ్గిందని పేర్కొన్నారు. గతేడాదితో పోల్చితే టర్మ్‌ రుణాలు రూ.3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయని చెప్పారు. సాగు రంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ జరిగిందని.. పంట రుణాలు 10.49 శాతం అధికంగా ఇచ్చామన్నారు. కౌలు రైతులకు రుణాలపై దృష్టి పెట్టాలని కోరారు. సంపూర్ణ డిజిటలైజేషన్‌కు ప్రతిరూపాలుగా ఆర్బీకేలను తీర్చిదిద్దాలన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.35 వేలు రుణం ఇచ్చేందుకు బ్యాంకులు చొరవ చూపాలని కోరారు. బ్యాంకులు 3 శాతం వడ్డీకి ఇస్తే.. మిగిలిన వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. చిరు వ్యాపారులకు రుణాల మంజూరు, ఎంఎస్‌ఎంఈలకు బ్యాంకర్లు అండగా ఉండాలని సీఎం కోరారు.