నటి పాయల్‌ ఘోష్‌పై యాసిడ్‌ దాడి.. గాయాలు

సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన నటి పాయల్ ఘోష్‌పై యాసిడ్‌ దాడి జరిగింది. ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చిన కొందరు తనపై దాడి చేసినట్లు పాయల్‌ తెలిపింది. ముంబైలో ఓ షాపులో మందులు కొనుక్కొని తిరిగి వచ్చి కారులో కూర్చుంటున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. పాయల్‌ తనపై జరిగిన దాడికి సంబంధించిన అంశాలను వెల్లడిస్తూ ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది.

అందులో.. ఆమె తన కారులోకి వెళ్తుండగా కొంతమంది మాస్క్‌ ధరించిన వ్యక్తులు రాడ్‌తో దాడి చేశారని, వారి చేతిలో బాటిల్ కూడా ఉందని, అది యాసిడ్ అని తాను భావించినట్లు పాయల్ చెప్పింది. అయితే ఈ దాడి నుంచి తను తప్పించుకున్నట్లు, కానీ ఎడమ చేతికి స్వల్పంగా గాయం అయ్యినట్లు పేర్కొంది. దాడి జరుగుతున్న సమయంలో తాను గట్టిగా అరవడంతో వారు అక్కడి నుంచి పారిపోయారని తెలిపింది.

ఇలాంటి సంఘటన తన జీవితంలో ఎప్పుడూ జరగలేదని ఇదే మొదటిసారని పాయల్‌ చెప్పుకొచ్చింది. ఈ అంశంపై పోలీసు కేసు నమోదు చేయనున్నట్లు నటి వెల్లడించింది. కాగా ఈ దాడికి సంబంధించి ఎవరినైనా అనుమానిస్తున్నారా అనే దానిపై మాట్లాడుతూ పాయల్ ఇలా చెప్పింది.. స్పష్టంగా, తెలిసిన వాళ్లు కాదు కానీ ఇదంతా ఓ ప్లాన్‌ ప్రకారం చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది.