సందడిగా అలయ్ బలయ్.. హాజరైన వెంకయ్య నాయుడు, తమిళిసై, పవన్ కల్యాణ్
దసరా పండుగ తర్వాత ప్రతి ఏడాది నిర్వహించే ‘దత్తన్న అలయ్ బలయ్’ కార్యక్రమం హైదరాబాద్లోని జలవిహార్లో ప్రారంభమైంది. పలువురు ప్రముఖులు, పలు పార్టీల నేతలు జలవిహార్ చేరుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అలాగే, తెలంగాణ గవర్నర్ తమిళి సౌందర రాజన్, హిమాచల్ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, సినీనటుడు కోట శ్రీనివాసరావు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు అలయ్ బలయ్ కార్యక్రమానికి వచ్చారు.
కాసేపట్లో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, పలు పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి రానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారులు నృత్యాలతో అలరిస్తున్నారు. దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.