ఆర్యన్కు మరోసారి చుక్కెదురు.. బెయిల్ నిరాకరించిన కోర్టు
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు మరోసారి చుక్కెదురైంది. బుధవారం ముంబయి ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది. అతడితో పాటు మరో ఇద్దరికి కూడా బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. అక్టోబర్ 2న ముంబయి తీరప్రాంతంలో క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఆర్యన్ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని అతడి తరఫు న్యాయవాదులు ఇదివరకే కోర్టుకు వెల్లడించారు. ఇప్పుడు బెయిల్ ఇస్తే డ్రగ్స్ కేసు దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని ఎన్సీబీ వెల్లడించింది. ఈ క్రమంలో ఆర్యన్ పలుమార్లు పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనలను కోర్టు తోసిపుచ్చింది.
ఈ రోజు విచారణలో భాగంగా ఎన్సీబీ కోర్టుకు పలు ఆధారాలు సమర్పించింది. ఓ నటితో ఆర్యన్ డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్లు దర్యాప్తులో గుర్తించామని చెప్పింది. అంతేగాక, డ్రగ్స్ విక్రేతలతో ఆర్యన్ చాటింగ్ చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వాట్సాప్ చాట్లను ఎన్సీబీ నేడు కోర్టుకు సమర్పించింది. డ్రగ్స్ విక్రేతలకు అతడు రెగ్యులర్ కస్టమర్ అని తమ దర్యాప్తులో తేలినట్లు ఎన్సీబీ వెల్లడించింది.
నవంబర్ కల్లా బెయిల్ రాలేదంటే..
మరోవైపు ఆర్యన్ మరికొంతకాలం ఆర్థర్ రోడ్డు జైల్లోనే ఉండాల్సి ఉంది. నవంబర్ మొదటివారంలోనే అతడికి బెయిల్ రాలేదంటే ఆ గడువు ఇంకా పెరిగే అవకాశం ఉంది. వచ్చే నెలలో కోర్టులకు సెలవులు ఉండటమే అందుకు కారణం. దాంతో ఈ లోపే న్యాయవాదులు ఆర్యన్కు బెయిల్ ఇప్పించే పనిలో ఉన్నారు. వారు బాంబే హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.