బంగాళాఖాతంలో వాయుగుండం… ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం ఇది చెన్నైకి ఆగ్నేయ దిశగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఈ సాయంత్రానికి కారైక్కల్, శ్రీహరికోటల మధ్య తీరానికి చేరువగా రానుంది.

దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజా బులెటిన్ లో వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీర ప్రాంతాల్లో 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది.