విశాఖలో భూ ప్రకంపనలు

విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. అక్కయ్యపాలెం, మధురానగర్‌, బీచ్‌రోడ్డు, తాటిచెట్లపాలెం, అల్లిపురం, ఆసిల్‌మెట్ట, సీతమ్మధార, గురుద్వారా, రైల్వేస్టేషన్‌, బీచ్‌ రోడ్డు, హెచ్‌బీకాలనీ, జ్ఞానాపురం, బంగారమ్మమెట్ట, సింహాచలం, అడవివరం, గోపాలపట్నం ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.

విశాఖ ఓల్డ్ టౌన్‌తో పాటు, ఫిషింగ్ హార్బర్ పరిసర ప్రాంతాల్లోనూ భారీ శబ్దంతో ఉదయం 7.15 గంటల సమయంలో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శాంతిపురం ఎన్జీవోస్‌ కాలనీలో భవనాల శ్లాబ్‌ పెచ్చులు ఊడి పడ్డాయి. భూ ప్రకంపనలపై భూగర్భ శాస్త్రవేత్తలు వివరాలు వెల్లడించాల్సి ఉంది.