నిందితుడికి కఠిన శిక్షలు పడేలా చర్యలకు జనసేన డిమాండ్
పట్టపగలు కూడా బాలికలు రోడ్డుపై తిరిగే పరిస్థితి లేదా?
నిందితులకు వెంటనే కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి
అధికార పార్టీ ఒత్తిళ్లతో ఉపేక్షిస్తే జనసేన సహించదు
డా.వంపూరు గంగులయ్య -జనసేన పాడేరు, అరకు పార్లమెంట్ ఇన్చార్జ్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, గిరిజనశాఖ మంత్రి పుష్పశ్రీవాణి సొంత నియోజకవర్గం కురుపాంలో అమాయకురాలైన ఇద్దరు గిరిజన బాలికలపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డ బాధితులు భరితెగించి బెదిరించే పరిస్థితి దాపురించిందంటే ఈ రాష్ట్రంలో గిరిజనులకు రక్షణ ఎక్కడుందో ఓసారి పాలకులు చెప్పాల్సి ఉంది. అందులోనూ గిరిజన బాలికలంటే ఇంత చులకగా వ్యవహరిస్తారా? విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం కురుపాం పంచాయతీ టేకరకండి వద్ద ఇద్దరు బాలికలు తన సహచర బాలుర స్నేహితులతో కొత్తసంవత్సరం నాడు బయటకొస్తే ఇలాంటి దారుణ పరిస్థితికి ఒడిగడతారా? అంటే రాత్రిళ్లు ఎలాగూ రక్షణ ఉండడం లేదు. పట్టపగలు కూడా బాలికలు రోడ్డుపై తిరగలేని పరిస్థితులు దాపురించాయని ఈ సంఘటన బట్టి స్పష్టమవుతుంది. ఉపముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఇంతటి అన్యాయం జరిగితే నిందితులకు శిక్ష పడేలా చేస్తామని పాత కథలే చెబుతున్నారు ఈ పాలకులు. అందులో మహిళలకు చిన్నపాటి అన్యాయం జరిగినా వెంటనే శిక్ష పడేలా ఈ ప్రభుత్వ పెద్దగా గొప్పగా చెప్పుకునే దిశ చట్టం ఏం చేస్తుంది?. కురుపాం నియోజకవర్గ కేంద్రంలోనే ఇలా జరిగేతే మిగిలిన గిరిజన ప్రాంతాల్లో రక్షణ లేని చోట మా గిరిజన బిడ్డల రక్షణ కరువైనట్టే. అందులో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా, నిందితులకు వెంటనే కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. ఇటువంటి మళ్లీ పునరావృతం కాకుండా ఉండేలా నిందితులకు శిక్షలు ఉండాలి. అప్పుడు ప్రభుత్వంపైనా, పోలీస్ యంత్రాంగం పైనా నమ్మకం ఏర్పడుతుంది. ఇటువంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. బాధితుడు వైఎస్సార్సీపీ అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఒత్తళ్లకు తలొగ్గి కేసును నీరుగార్చడానికి ప్రయత్నిస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోబోదు. వెంటనే నిందితుడికి కఠిన శిక్షలు పడేలా చర్యలకు జనసేన డిమాండ్ చేస్తోంది.