ఆరోగ్య శ్రీ పరిధిలోకి కోవిడ్-19

ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనాను తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే కరోనా చికిత్స పొందిన పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద సాయం చేస్తామని తెలిపారు. వాటికి సంబంధించిన బిల్లులుంటే తనకు పంపాలని కోరారు. కరోనాపై బుధవారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్‌ తదితరులు చేసిన సూచనల్లో కొన్ని పాటించేవి ఉన్నాయన్నారు.

బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ కంటే మన ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు పటిష్టంగా ఉందని చెప్పారు కేసీఆర్. ఆరోగ్యశ్రీని, 108ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చారని.. ఆ పథకాలు బాగున్నందువల్లే తాము వాటి పేరును కూడా మార్చకుండా అలాగే కొనసాగిస్తున్నా మని స్పష్టంచేశారు. రాష్ట్ర గవర్నర్‌కు కూడా ఆయుష్మాన్‌ భారత్‌తో కలిపి ఆరోగ్యశ్రీని నడిపిస్తామని చెప్పామన్నారు. కేంద్రం అనుమతిస్తే రెండూ కలిపి వాడతామని వెల్లడించారు.

రోగుల పట్ల కార్పొరేట్ ఆస్పత్రులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయన్నారు కేసీఆర్. ఏ ఆస్పత్రి అయినా వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఐసీఎంఆర్ 15 ఆస్పత్రులకు మాత్రమే అనుమతి ఇచ్చిందన్నారు. కరోనా విషయంలో మంత్రి ఈటల బాగా పనిచేశారని ఈ సందర్భంగా సీఎం ప్రశంసిస్తూ కరోనాను అడ్డుకోనేoదుకు వేల కోట్లు ఖర్చు పెట్టామని పేర్కొన్నారు.