రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాడుదాం: రాటాల రామయ్య
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-30-at-8.45.39-PM-1024x627.jpeg)
అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించేవరకూ కలిసి పోరాడతామని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు రాజంపేట పట్టణంలో ఆదివారం జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. రాయచోటి వద్దు రాజంపేట ముద్దు రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ, ర్యాలీలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మాట్లాడుతూ, అన్నమయ్య జిల్లా కేంద్రంగా కరువు ప్రాంతమైన అటువంటి రాయచోటి కాకుండా అన్ని విధాలుగా నీటి సదుపాయం రవాణా మార్గాలు కలిగిన రాజంపేటను జిల్లా కేంద్రంగా కొనసాగించాలని ఆయన కోరారు. రాజంపేట అన్నమయ్య జిల్లా కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించే వరకు ఉద్యమాలు చేపడతామన్నారు. రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, ఆకేపాటి అమర్నాథరెడ్డిలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఎటువంటి కార్యాచరణ చేపట్టకపోవడం హాస్యాస్పదమని అన్నారు. ఆరుమండలాల్లోని ఎమ్మెల్యే వర్గానికి చెందిన ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచులు, కనీసం వార్డ్ నెంబర్లు కూడా రాజీనామాలు ప్రకటించకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వారి అనుచరులు ప్రజాప్రతినిధులు మన ప్రాంతాన్ని కాపాడుకునేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.