రాయల్ చాలెంజర్స్ శుభారంభం
పుష్కర కాలంగా ఐపీఎల్ టైటిల్ కోసం వేచిచూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) యూఏఈ వేదికగా జరుగుతున్న 13వ సీజన్లో బోణీ కొట్టింది. సోమవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
సాధారణ స్కోరును సైతం ఛేదించలేక ఎస్ఆర్హెచ్ చతికిలబడింది. సన్రైజర్స్ జట్టులో ఓపెనర్ జానీ బెయిర్స్టో 61 రన్స్ చేయగా మనీష్ పాండే 34 పరుగులు చేశారు. వార్నర్ అత్యవసర పరిస్థితుల్లో ఔటవ్వడం.. ఆ తర్వాత బెయిర్స్టో,మనీష్ పాండే అదుకునే ప్రయత్నం చేసినా.. వారు కూడా ఫెయిలవ్వడంతో సన్రైజర్స్ బాట్స్మెన్స్ వెంటనే..వెంటనే పెవిలియన్ కు చేరడంతో ఎస్ఆర్హెచ్ జట్టు ఓటమిపాలైంది. 15 ఓవర్లకు 121/2తో పటిష్టంగా కనిపించిన సన్రైజర్స్ జట్టు చివరి ఐదు ఓవర్లలో మిగతా 8 వికెట్లు కోల్పోయి.. 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 రన్స్ చేసింది. ఓపెనర్లు దేవ్దత్ పడిక్కల్(56; 42 బంతుల్లో 8×4), ఆరోన్ ఫించ్ (29; 27 బంతుల్లో 1×4, 2×6) మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 90 పరుగులు జోడించాక వెంటవెంటనే ఔటయ్యారు. తొలుత విజయ్ శంకర్ వేసిన 11వ ఓవర్ చివరి బంతికి దేవ్దత్ క్లీన్బౌల్డ్ అవ్వగా, తర్వాత 12వ ఓవర్ మొదటి బంతికి అభిషేక్ శర్మ బౌలింగ్లో ఫించ్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. అనంతరం కోహ్లీ (14), డివిలియర్స్ (51: 30 బంతుల్లో 4×4, 2×6) కాసేపు వికెట్ కాపాడుకునేందుకు ప్రయత్నించగా భారీ షాట్ ఆడబోయి విరాట్ నిష్క్రమించాడు. చివర్లో గేర్ మార్చిన డివిలియర్స్ ఫోర్లు, సిక్సర్లతో ఎదురుదాడి చేశాడు. దీంతో బెంగుళూరు చివరికి 163/5తో సరిపెట్టుకుంది.