ఎన్‌సీబీ విచారణకు రకుల్ ప్రీత్ సింగ్

డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) నుంచి నోటీసులు అందుకున్న సినీ నటి రకుల్‌ప్రీత్‌సింగ్ నేడు విచారణకు హాజరయింది. ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి ఇవాళ ఉదయం ఆమె విచారణ నిమిత్తం వెళ్లింది. దీపికా పదుకొనె మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌ను కూడా ఎన్‌సీబీ విచారిస్తోంది. ఎన్సీబీ విచారణకు దీపిక, సారా అలీఖాన్‌ శనివారం హాజరయ్యే అవకాశం ఉంది. దీపికాతో పాటు విచారణకు హాజరవుతానన్న రణ్‌వీర్‌సింగ్ ఎన్‌సీబీకి కోరాడు. దీపిక ఒక్కోసారి ఉద్వేగానికి గురవుతుందని, విచారణకు హాజరయ్యేందుకు తనకూ అవకాశమివ్వాలని ఎన్‌సీబీని రణ్‌వీర్ కోరాడు.

డ్రగ్స్ కేసులో బాలీవుడ్‌ తారలు దీపికా పదుకొనే, సారా అలీఖాన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌తో పాటు శ్రద్ధా కపూర్‌కు కూడా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీపిక మేనేజర్‌ కరిష్మాప్రకాశ్‌, ఆత్మహత్యకు పాల్పడ్డ నటుడు సుశాంత్‌సింగ్‌ మేనేజర్‌ శ్రుతి మోదీ, డిజైనర్‌ సిమోన్‌ ఖంబట్టాను కూడా విచారణకు పిలిచారు. సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి వెల్లడించిన వివరాల మేరకు టాలెంట్‌ సంస్థ మేనేజర్‌ జయా సాహాను విచారించగా పలువురు బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.