అచ్యుతాపురం గ్రామ ప్రజల సామూహిక నిరాహార దీక్ష

గోకవరం మండలం, అచ్యుతాపురం గ్రామం మధ్య నుండి ఐఓసిఎల్ కేంద్రానికి విద్యుత్ సరఫరా కోసం చేపట్టిన విద్యుత్ టవర్ లైన్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ.. జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర, శ్రీదేవి దంపతులు గ్రామస్థులతో కలిసి గురువారం ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ శిబిరాన్ని స్థానిక డి.ఎస్.పి కదలి వెంకటేశ్వరరావు, కోరుకొండ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి, గోపవరం తాసిల్దార్ పోసిబాబు, గోకవరం ఎస్సై నాగబాబు తదితరులు సందర్శించి దీక్ష విరమించాలని.. సూచిస్తూ చర్చలు జరిపారు. ప్రస్తుతం నిర్మాణం జరుగుతోందని ఉన్నత అధికారులు ఆదేశాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాటంశెట్టి ‘సూర్యచంద్ర మాట్లాడుతూ.. గ్రామం మధ్య నుండి విద్యుత్ లైన్ ఏర్పాటు చేయవద్దని అధికారులకు వినతిపత్రం ఇదివరకే ఇవ్వడం జరిగిందన్నారు. ప్రత్యామ్నాయ మార్గంలో దగ్గరి దారిలో ఈ లైన్ నిర్మాణం చేయడం వల్ల గ్రామానికి ఇబ్బంది ఉండదని తెలియజేసినట్లు వివరించడం జరిగిందన్నారు. అయినప్పటికీ నిర్మాణ పనులు చేపట్టారని తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ పనులు నిలిపివేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన అధ్యక్షులు ఉంగరాల మణి రత్నం, గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు నల్లల వెంకన్నబాబు, పలువురు గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.