నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం

రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య నీటివివాదాలు మొదలయ్యాయి. విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిష్ణా,గోదావరి నదులపై ప్రాజెక్ట్ లు కట్టాలంటే నదీ యాజమాన్య బోర్డ్ లతో పాటూ ఉభయ రాష్ట్రాల అంగీకారం, అపెక్స్ కౌన్సిల్ ఆమోద ముద్ర తప్పని సరి. అయితే ఇవేమి లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ప్రయోజనాలను హరించే విదంగా కుట్ర చేస్తుందని సీఎం కేసీఆర్ మండిపడుతున్నారు. పోతిరెడ్డిపాడు…రాయల సీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపాలంటూ క్రిష్టాబోర్డ్ కు తెలంగాణ పిర్యాదు చేయగా…తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ల అన్నింటిపై తమకు అనుమానాలు ఉన్నాయని…వాటి డీపిఆర్ లు కావాలంటూ ఏపి క్రిష్టా-గోదావరి బోర్డ్ లో పిర్యాదు చేసింది. దీంతో రెండు రాష్ట్రాల మద్య జలబందం కాస్త …జల జగడంలా మారింది. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి రంగంలోకి దిగిన కేంద్రం ఈ నెల 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించబోతోంది.

ఈ నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలను, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను తీసుకొని సమావేశానికి రావాల్సిందిగా అధికారులను సిఎం ఆదేశించారు.ఆంధ్రప్రదేశ్ నదీ జలాల విషయంలో కావాలనే గొడవ పెట్టుకుంటుందని… అపెక్స్ సమావేశంలో ఏపీ చేస్తున్న వాదనలకు ధీటైన సమాధానం చెప్తామంటూ సీఎం ప్రకటించారు. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టం చేయడంతోపాటూ…అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని..నిర్లక్ష్యాన్ని ఎండగట్టే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. మొత్తానికి ఈ సారైనా అపెక్స్ కౌన్సిల్ లో జల జగడాలకు పరిష్కారం దొరుకుతుందా…. లేదంటే రెండు రాష్ట్రాల మధ్య మరికొన్ని సమస్యలు తలెత్తుతాయా అన్నది త్వరలోనే తేలనుంది.