లాలాపేట్లో మంత్రి కేటీఆర్ పర్యటన
హైదరాబాద్ భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతూనే ఉంది. పర్యటనలో భాగంగా ఈ రోజు కెటిఆర్ లాలాపేట్లో పర్యటించారు. వరద ప్రభావానికి గురైన కాలనీల్లో కెటిఆర్ పర్యటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందజేశారు. బాధితులందరికీ అండగా ఉంటామని కెటిఆర్ భరోసా ఇచ్చారు. కెటిఆర్ వెంట డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, స్థానిక కార్పొరేటర్లు ఉన్నారు.
మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. తొలిరోజు 1036 మందికి రూ. 10వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించినట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. బాధితులకు నగదు పంపిణీలో మంగళవారం 100 టీంలు పాల్గొన్నాయి. ఒక్కో టీంలో ముగ్గురిని నియమించారు. టీంల సంఖ్యను బుధవారం నుంచి రెట్టింపు చేయనున్నారు. ఈ సంఖ్యను 200లకు పెంచి ఆర్థిక సాయం అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. నగదు పంపిణీ కార్యక్రమాన్ని సీఎస్ సోమేశ్కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. బాధితులకు వీలైనంత త్వరగా సాయం అందేలా చర్యలు తీసుకున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2020/10/image-22.png)