విజయవాడలో అగ్ని ప్రమాదం
విజయవాడ సమీపంలోని చిట్టినగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మిల్క్ ప్రాజెక్ట్ సమీపాన ఉన్న పాత ప్రసాద్ థియేటర్లో అర్ధరాత్రి సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రసాద్ థియేటర్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పి వేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. థియేటర్ మూతపడటంతో ప్రాణనష్టం తప్పింది.