సినీ పరిశ్రమకు రాయితీలు, మినహాయింపులపై హామీ

తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుంటామని..దీనికి కావల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. చిరంజీవి, నాగార్జు నేతృత్వంలో సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఆదివారం అయినప్పటికీ.. కేసీఆర్ సినీ ప్రముఖులకు సమయం ఇచ్చారు. చిరంజీవి, నాగార్జునతో పాటు నారాయణ్‌దాస్‌, కేఎల్‌ దామోదర్‌, సి.కల్యాణ్‌, సుధాకర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి వంటి వారందరూ కేసీఆర్‌ను కలిసి కోవిడ్ కారణంగా పరిశ్రమలోని వివిధ విభాగాలకు వాటిల్లిన నష్టాన్ని వివరించారు. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్..తెలుగు సినీ పరిశ్రమను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా వైరస్ కారణంగా షూటింగులు నిలిచిపోయి..థయేటర్లు మూతపడి..పరిశ్రమకు , కార్మికులకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం నుంచి కోలుకోడానికి మినహాయింపులు, రాయితీలు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి పరిశ్రమలు తరలి రావడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. అలాంటిది ఉన్న పరిశ్రమను కాపాడుకోకపోతే ఎలా? అని అన్నారు. దేశంలో ముంబాయి, చెన్నైతో పాటు హైదరాబాద్ లోనే పెద్ద సినీ పరిశ్రమ ఉంది. లక్షలాది మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి దొరుకుతుంది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని కేసీఆర్ చెప్పారు. అటు ప్రభుత్వం, ఇటు సినీ పరిశ్రమ పెద్దలు కలిసికట్టుగా ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్బంగా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో సినిమా పరిశ్రమకు చెందిన అంశాల్ని ప్రస్తావించామన్నారు.