టిడ్కో ఇళ్లను బూత్ బంగ్లాలుగా మార్చారు

రాజంపేట: జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాయచోటి అసెంబ్లీ ఇన్చార్జ్ హసన్ భాష ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా, రాయచోటిలో ఉన్న టిడ్కో గృహాలను జనసేన పార్టీ బృందం భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రామా శ్రీనివాస్, ప్రదీప్, మస్తాన్ జయరాం చిన్నారి మాట్లాడుతూ.. టిడ్కో గృహాలను అధికార వైసీపీ పార్టీ బూత్ బంగ్లాలుగా మార్చిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను పూర్తి చేయకుండా వైసిపి ప్రభుత్వం అనర్హులకు ఇచ్చారంటూ ఇప్పటివరకు గృహాలను లబ్ధిదారులకు అందజేయలేదు అన్నారు. సొంత ఇంటి కల సాకారం కాక పేదలు ఇళ్లలోనే మగ్గుతూ నేటికీ నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కేవలం ప్రతిపక్షాలను తిట్టటమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు పేదల పట్ల చిత్త శుద్ధి ఉంటే వెంటనే టిడ్కో గృహాలను పూర్తిచేసి లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రానున్న కాలంలో జనసేన ప్రభుత్వం లబ్ధిదారులకు గృహాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పఠాన్, మయానా మొహమ్మద్ అలీ, జిల్లా దూదేకుల సంఘం అధ్యక్షులు మస్తాన్, జయరాం చిన్నారి, ఉదయగిరి శివ, నగేష్, నాగేంద్ర, నవీన్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.