టాప్-4లో సోనూ సూద్

ఇటీవల పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా మారిన సోనూ సూద్ తాజాగా మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్ డౌన్ విధించిన సమయంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడంలో ఎంతో శ్రమించి, రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్, తన ఔదార్యంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.  తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లను కలిగివున్న భారతీయుల్లో టాప్-4కు దూసుకెళ్లాడు.ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ తొలి స్థానంలో ఉండగా, ఆ తరువాత అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లను కలిగివున్న వారిలో రాహుల్ గాంధీ, విరాట్ కోహ్లీ ఉన్నారు. నాలుగో స్థానంలో సోనూ సూద్ నిలిచారని సోషల్ మీడియా అనలిటిక్స్ వెల్లడించింది. ఈ క్రమంలో బాలీవుడ్ లో ఖాన్ ల త్రయంతో పాటు, అందరు సూపర్ స్టార్లను, ప్రధాన రాజకీయ నాయకులను సోనూ సూద్ దాటి రావడం గమనార్హం.