సీఎం అక్కర్లేదు.. మోదీ పర్యటనపై పీఎంవో ఆదేశాలు..

నేడు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పీఎంవో కార్యాలయం కొత్త నిబంధనలు జారీ చేసింది. ప్రధానికి స్వాగతం పలికేందుకు కేవలం ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతినిచ్చింది. ఇందులో హకీంపేట్ ఎయిర్‌ కమాండెంట్ కేవీ సురేంద్ర నాయర్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి,హైదరాబాద్ డీజీపీ మహేందర్ రెడ్డి,సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికేందుకు రావాల్సిన అవసరం లేదని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు సమాచారం ఇచ్చారు. ఈ ప్రత్యేక సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం ఆశ్చర్యపోయింది.

సాధారణంగా ప్రధాని అధికారిక పర్యటనల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి,గవర్నర్లు స్వాగతం పలకడం రివాజు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ వచ్చి స్వాగతం పలుకుతారని సీఎంవో కార్యాలయం పీఎంవో కార్యాలయానికి సమాచారం ఇచ్చింది. అయితే గత రివాజులకు తిలోదకాలిచ్చేలా… సీఎం రావాల్సిన అవసరం లేదని పీఎంవో కార్యాలయం నుంచి సమాచారం రావడం చర్చనీయాంశంగా మారింది.