తోట త్రిమూర్తులు భూ కబ్జా వ్యవహారంపై జనసేన న్యాయ పోరాటం

  • డిసెంబర్ నెల 4న పల్లెపాలంలో జనసేన యుద్ధ భేరీ..
  • భూ కబ్జాపై మంత్రి చెల్లబోయిన వేణు నేటికి స్పందించకపోవడం దుర్మార్గం..
  • మండపేట ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ..

మండపేట: గత పదిహేను రోజులుగా కాజులూరు మండలం, పల్లిపాలెం గ్రామంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కబ్జా చేసిన ప్రభుత్వ ల్యాండ్ సీలింగ్ భూమిపై చేసిన ఆరోపణలపై నేటికీ మేము కట్టుబడి ఉన్నామని మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఆయన మీడియా సమావేశం పెట్టి ఒక సెంటు భూమి ప్రభుత్వానిది ఉంటే వదిలేస్తామని చెప్పారన్నారు. కానీ ఆర్ డివో గారు పల్లిపాలెం గ్రామంలో 35.94 ఎకరాలు భూమి ప్రభుత్వానికి చెందిన భూమిగా ధ్రువీకరించారని చెప్పారు. త్రిమూర్తులు ఈరోజు వరకు దీనిపై సమాధానం చెప్పకపోగా.. ప్రభుత్వానికి చెందిన భూమిని ఆక్రమించుకొని, డిసిసి బ్యాంకులో కోట్లాది రూపాయలు లోన్లు తీసుకొన్నారని ఆరోపించారు. ప్రభుత్వం మీ అధీనంలో ఉంది కదా, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతారని విమర్శించారు. ఈ నెల 4వ తేదీన తోట త్రిమూర్తులు భూ కబ్జాపై న్యాయపరమైన పోరాటం చేస్తామని, పల్లెపాలం గ్రామం నుంచే యుద్ధ భేరి మోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. జనసేన పార్టీలో అర్హులైన పేదలకు ఆ భూములు పంచే వరకు పోరాటం చేస్తుందని తెలిపారు. పార్టీ హై కమాండ్ పూర్తిగా మాకు మద్దతుగా ఉందని అన్నారు. మీరు ఆ భూములు పేదలకు తిరిగి ఇస్తామంటే స్వయంగా మా పార్టీ పెద్దలు వస్తారు దానికి మీరు సిద్ధమేనా అని ప్రశ్నించారు. పేద ప్రజలు భూములను ఆక్రమించుకొని గత 17 ఏళ్ళ నుండి నేటి వరకు ఏదైతే అనుభవిస్తున్నావో, బ్యాంక్ లోన్స్ తో అన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని డిమాండ్ చేశారు. తోట త్రిమూర్తులుపై ఆరోపణలు చేయడానికి కోకొల్లలుగా ఉన్నాయని విమర్శించారు. మరొక ఆరోపణ చేస్తూ కాకినాడ రామనయ్యా పేటలో 212 సర్వే నెంబరులో 5 ఎకరాల భూమిని ముత్త మాణిక్యం అనే పేరు మీదున్న భూమిని ప్రభుత్వం గతంలో ల్యాండ్ అక్విజర్స్ చేస్తే దానిని ఈ ప్రభుత్వంలో పెద్దలతో కుమ్మక్కై ఆ భూమిని అక్రమించడానికి కోర్టులో తప్పుడు పిటిషన్లు వేస్తున్నారని అన్నారు. దానిపై కోర్టులో న్యాయపరమైన పోరాటం చేయడానికి మా అధిష్టానం నుంచి పూర్తి అనుమతి లభించిందని దానికి మేము సిద్దమవుతున్నామని స్పష్టం చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం మంత్రివర్యులు చెల్లబోయిన వేణు, గోపాలకృష్ణ మరియు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని డిమాండ్ చేస్తూ నియోజకవర్గంలో 35.94 ఎకరాలు ప్రభుత్వ భూమిని త్రిమూర్తులు అక్రమించుకుంటే మీరు ఈరోజు వరకు దానిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని లీలాకృష్ణ ప్రశ్నించారు. దీనిపై నేటికీ స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు. రాబోయే మూడు రోజుల్లో దీనిపై మీరు చర్యలు తీసుకోకపోతే దీనికి పూర్తి బాధ్యత వహించి స్థానిక ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీన పల్లెపాలం గ్రామానికి వెళ్తున్నామని అక్కడ జరిగిన తప్పులు అన్ని రాష్ట్ర ప్రజలు తెలియజేసి, త్రిమూర్తులను దోషిగా ప్రజా కోర్టులో నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ.. 4వ తేదీ నుంచి మా యుద్ధం మొదలవుతుందని లీలాకృష్ణ స్పష్టం చేశారు.