జనంలోకి జనసేనాని.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన షెడ్యూల్ ఖరారు

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా తుఫాను ప్రభావం చూపిన జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటించబోతున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ను పార్టీ కార్యాలయం అధికారికంగా విడుదల చేసింది.

ఏపీలో నెలకొన్ని తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇటీవల సంభవించిన నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. డిసెంబర్ 2వ తేదీ కృష్ణా జిల్లా ఉయ్యూరు నుండి పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ ప్రాంతాలలో జనసేనాని పర్యటించేలా పార్టీ టూర్ ప్లాన్ రెడీ చేసింది. ఆయా ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించిన తర్వాత అక్కడి రైతాంగంతో పవన్ కల్యాణ్ భేటీ అవుతారని జనసేన పార్టీ తెలిపింది. ఆ తర్వాత పులిగడ్డ వంతెన మీదుగా గుంటూరు జిల్లా భట్టిప్రోలు, చావలి, పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు, కొలకలూరుల్లో పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతుంది. డిసెంబర్ 3వ తేదీన తిరుపతికి చేరుకుని.. అటు నుంచి చిత్తూరు జిల్లాలో జరిగిన పంట నష్టాలను తెలుసుకునేందుకు జనసేన నాయకులతో సమావేశమవుతారు. డిసెంబర్ 4వ తేదీన శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరుల్లో పర్యటించి కర్షకులను కలుస్తారు జనసేనాని. 5వ తేదీన నెల్లూరు, రాపూరు, వెంకటగిరి ప్రాంతాల్లో పవన్ పర్యటన కొనసాగుతుందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.