ఏపీ రాజధాని అమరావతిలోనే.. సోము వీర్రాజు

ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ లక్ష్యమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇందులో రెండో ఆలోచనకు తావు లేదని చెప్పారు. తుళ్లూరులో జరిగిన భారతీయ కిసాన్ సంఘ్ సమ్మేళన్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడి ప్రతినిధిగా తాను మాట్లాడుతున్నానని సోము వీర్రాజు చెప్పారు.

అమరావతిలో రూ. 1800 కోట్లతో నిర్మిస్తున్న ఎయిమ్స్ ఆసుపత్రి ఆగలేదని, దుర్గమ్మ ఫ్లైఓవర్ ను పూర్తి చేశామని. మోడి అమరావతి వైపే ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఏపి బిజెపి కార్యాలయాన్ని కూడా విజయవాడలోనే కడుతున్నామని చెప్పారు. బిజెపి మాట తప్పే పార్టీ కాదని అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని బిజెపి తరపున ఉద్యమం చేస్తామని చెప్పారు. 2024 ఎన్నికల్లో బిజెపికి అధికారాన్ని అందిస్తే. అమరావతిని మరింత అభివృద్ది చేస్తామని అన్నారు.