తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ రెడీ

తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కోసం పార్టీలన్నీ సిద్ధపడుతున్నాయి. నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకపోయినా అప్పుడే తిరుపతి ఎన్నికపై రాజకీయ పార్టీల్లో స్పీడ్ పెరిగింది. ముఖ్యంగా ఈ బైపోల్‌ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. జనసేన ఎటూ పోటీ చేయదని భావించిన బీజేపీ తిరుపతి ఉప ఎన్నికల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటోంది. మరోవైపు టీడీపీ ఇప్పటికే తమ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ప్రకటించింది. ఆమె ప్రచారంలోకి కూడా దిగారు.

ఏపీలో బీజేపీ, జనసేనలు మిత్రపక్షంగా కొనసాగుతున్నాయి. అయితే.. ఈ ఉప ఎన్నికలో కలిసి పోటీ చేస్తాయని ఆ రెండు పార్టీలూ సంయుక్త ప్రకటన చేశాయి. దీనిపై సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఎవరు పోటీ చేయాలన్నది సమన్వయ కమిటీ నిర్ణయిస్తుంది. అయితే.. బీజేపీ తాను పోటీ చేసేందుకే సిద్ధమయినట్లు ఆ పార్టీ చేస్తున్న ముందస్తున్న ఏర్పాట్లను చూస్తే అర్థమవుతోంది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో బలం లేకపోయినా తానే పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది.

పార్లమెంటు ఎన్నికల్లో సహజంగా మోడీ ఇమేజ్ వర్కవుట్‌ అవుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఇదే జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికారంలో ఉండటంతో ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక కావడంతో తమకే అవకాశం ఇవ్వాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. దీనికి పవన్ కల్యాణ్ కూడా జనసేన నుంచి పెద్దగా అభ్యంతరం చెప్పే అవకాశం ఉండదని భావిస్తోంది. అందుకే బీజేపీ తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో ముందస్తు ఏర్పాట్లలో మునిగిపోయింది.

పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని మొత్తం 45 మండలాలకు ఇన్‌చార్జీలను నియమించింది. రాష్ట్రస్థాయి నేతలనే ఇన్‌చార్జీలుగా నియామకం చేసింది. వీరందరూ ఇప్పటికే తమ మండల పరిధిలోని బూత్ లెవెల్ కమిటీలతో సమావేశమవుతున్నారు. బీజేపీ బరిలోకి దిగితే తమ పార్టీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులును రంగంలోకి దింపే అవకాశముంది. ఆయన కాదంటే రావెల కిషోర్ బాబుకు టికెట్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఇప్పటి నుంచే బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోందన్నమాట.