జనసేనలోకి వంగవీటి… కొత్త ప్రచారం కథ ఇదే…!
ఇప్పటికే పలు పార్టీలు మారి రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకున్న బెజవాడ యువనేత వంగవీటి రాధా ఇప్పుడు మళ్లీ పార్టీ మారబోతున్నారా? అంటే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీలోకి వచ్చిన రాధా ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు.
గత ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో ఉన్న ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ అవుతాననుకున్న ఆయన ఆశలు అడియాసలు కావడంతో పాటు వచ్చే ఐదారేళ్ల వరకు కూడా టీడీపీలో ఆయనకు ఎలాంటి పదవి దక్కే ఛాన్సే లేదు. ఈ క్రమంలోనే ఆయన జనసేనలో నెంబర్ 2 గా ఉన్న నాదెండ్ల మనోహర్తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి కొద్ది రోజుల క్రిందటే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలవడంతో ఆయన జనసేనలోకి వెళ్లిపోతున్నారన్న ప్రచారం జరిగింది.
తాజాగా విజయవాడ వచ్చిన నాదెండ్ల మనోహర్తో రాధా భేటీ కావడంతో ఆయన మనస్సు జనసేన వైపు లాగుతుందా? అన్న కొత్త చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం రాజకీయంగా రాధా సంధికాలంలో ఉన్నారు. ఆయనకు టీడీపీలో ఉన్నా గుర్తింపు ఉండడం లేదు.ఈ క్రమంలోనే ఆయన బీజేపీ లేదా జనసేనలోకి వెళ్లాలని చూస్తున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. రాధా ఏ పార్టీలోకి వెళతారన్నది క్లారిటీ లేకపోయినా ఆయనకు జనసేనే బెటరేమో అని కొందరు సూచిస్తున్నారు. జనసేనలో పవన్ వెంట ప్రస్తుతం మనోహర్ తప్ప మరో పేరున్న నేత లేరు. దీంతో ఆయన జనసేనలోకి వెళితే కాస్త వాయిస్ వినిపిస్తే అక్కడైనా మంచి లీడర్గా ఎదిగే ఛాన్స్ ఉండడంతో పాటు సామాజికవర్గపరంగా లాభిస్తుందని కొందరు సూచిస్తున్నారు.మరి వంగవీటి ఇప్పటి వరకు వేసిన రాంగ్ స్టెప్లు కాదని. ఇప్పటకి అయినా మంచి స్టెప్లో వేస్తారో ? లేదో ? చూడాలి.