బొమ్మ తలలు పగలగొడితే రాజకీయం చేస్తారా..

సీపీఐ అగ్రనేత నారాయణ తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆలయాల ఘటనలపై రాజకీయం సరికాదని హితవు పలికారు. ఏపీలో ఇప్పటివరకు మత రాజకీయాలు లేవని తెలిపారు. దయచేసి మత రాజకీయాలను ఏపీకి తీసుకురావొద్దని హితవు పలికారు. ఓట్ల రాజకీయానికి పేటెంట్ హక్కులు బీజేపీవేనని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పుడు ఓట్ల రాజకీయం నడుస్తోందని, ఇలాంటి చర్యలతో వైసీపీ, టీడీపీలకు ఓట్లు పడవని నారాయణ అభిప్రాయపడ్డారు.

బొమ్మల తలలు పగలగొడితే ఇంత రాజకీయం చేస్తారా?… కానీ రైతులు మరణిస్తే పట్టించుకోరా? మీకు అసలు సిగ్గుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి రైతులను ఎందుకు పరామర్శించరు? అని నారాయణ నిలదీశారు. రైతుల ఆందోళనలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇలాంటి మత సమస్యలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.