భీష్మ ఏకాదశి విశిష్టత..

మాఘమాసం శుక్ల పక్షం ఏకాదశి మాఘమాసం ఎంతో పవిత్రమయినది. ఈరోజున భీష్మ ఏకాదశిగా అంతర్వేది ఏకాదశిగా జరుపుకుంటారు. ఈరోజునే విష్ణు సహస్ర నామాలు పుట్టాయని.. అంపశయ్య మీదున్న భీష్ముడు పాండవులకు ఈ విష్ణు సహస్రనామాలను భోధించారని.. అందుకనే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి.. అటువంటి విష్ణు సహస్రనామాల పారాయణం ఎంతో విశిష్టమైంది. ఇక ఈ భీష్మ ఏకాదశినాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి.

పాండవులు అలా విష్ణువును వెయ్యి నామాలతో స్తుతించడం ద్వారా మహా సంగ్రామంలో విజయకేతనాన్ని ఎగురవేశారని పురాణాలు చెప్తున్నాయి. ఈ భీష్మ ఏకాదశి రోజున నరసింహ కల్యాణం జరిపిస్తారు. అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో, సింహాచలం నరసింహ స్వామి ఆలయంలో, యాదగిరి గుట్ట, భద్రాచాలం సీతారాముల వారి ఆలయంలో ప్రత్యేకపూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు.

అయితే ఈరోజు చేసే ఉపవాసం అత్యంత ఫలదాయకం అని పెద్దలు చెబుతారు. ఇక ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామ పారాయణ చేసే వారికి సకల సంపదలు చేకూరుతాయి. వారి కుటుంబంలో ఆయురారోగ్యాలు కలుగుతాయి.

ముఖ్యంగా ఈరోజు పసుపు రంగుకు విశిష్టత ఉంది. లక్ష్మీనరసింహ స్వామి వారికి పసుపు రంగుతో కూడిన పండ్లు, స్వీట్లు స్వామికి ప్రసాదంగా సమర్పించాలి. ఏకాదశి రోజున గోపూజ సకల ఫల దాయకం. గోమాతకు అరటిపండ్లు అందిస్తే అన్నిదోషాలు తొలగిపోతాయి.

పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని వినేవారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు ఉవాచ. ఇక భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచార్యునిని తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుందని హిందువుల నమ్మకం.