జనసేన నాయకుడిపై హత్యాయత్నంకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలి

కాకినాడ, పిఠాపురం జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మాదేపల్లి శ్రీనివాసరావుపై గుర్తు తెలియని వ్యక్తులు పిఠాపురం జనసేన కార్యాలయం వీధిలో కత్తితో పలు మార్లు రెక్కీ నిర్వహించడం పట్ల జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు మంగళవారం కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్కు వినతి పత్రం ద్వారా ఫిర్యాదును సమర్పించారు. ఈ సందర్భంగా ఉదయ్ ఎస్పీతో మాట్లాడుతూ పిఠాపురంలో జనసేన సీనియర్ నాయకుడు మాదేపల్లిపై కత్తితో దాడి చేసేందుకు రెక్కీ నిర్వహించారని చెప్పారు. వారి వెనుక ఉన్న వారిని, ఎవరి ప్రమేయం ఉందో చేసి తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం నియోజకవర్గంలో ఇటువంటి హత్య రాజకీయ ప్రయత్నాలు చేయడం పట్ల పిఠాపురం శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఈ సంఘటనపై విచారణ చేసి వారిని వెంటనే అదుపులో తీసుకోవాలని తంగెళ్ల ఎస్పీని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అద్యక్షులు కందుల దుర్గేష్, జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ పంతం నానాజి, జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ సిటి నియోజకవర్గ ఇంచార్జ్ ముత్తా శశిధర్, ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్యబాబు మరియు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్ పాల్గొన్నారు.