కెరీర్ మొత్తంలో ఆల్ టైమ్ రికార్డ్

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ న‌టించి ‘అల వైకుంఠపురములో’ సినిమా ఆయ‌న కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే.  త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన‌ ఈ సినిమా విడుదలై నిన్న‌టికి ఏడాది పూర‍్తయింది. ఈ సందర్భంగా ఆ సినిమా యూనిట్ మొత్తం నిన్న ఓ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసుకుని మాట్లాడారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ… గత ఏడాది సంక్రాంతి అనంత‌రం ఏడాది మొత్తం ప్రపంచానికి బ్యాడ్ ఇయర్ గా నిల‌చింద‌ని, అయితే త‌నకు మాత్రం అది బ్యాడ్ ఇయ‌ర్ కాద‌ని చెప్పాడు. త‌న కెరీర్ మొత్తంలో ఇటువంటి విజయాన్ని తాను అందుకోలేద‌ని తెలిపాడు.

ఈ సినిమా విడుదలై ఏడాది గ‌డుస్తున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ ఏదో ఒక విధంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తూనే ఉందని ఆయ‌న తెలిపాడు. అందుకే 2020 తనకు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకమని చెప్పాడు. తాను  ఈ సినిమా వల్లే లాక్‌డౌన్‌ను బాగా ఎంజాయ్ చేశాన‌ని చెప్పాడు.

ఈ సినిమాకు తమన్ ఎంతో గొప్ప పాటలు అందించాడని తెలిపాడు. ఒకవేళ సినిమాను సంక్రాంతికి కాకుండా సమ్మర్ లో విడుదల చేసి ఉంటే ఈ స్థాయిలో విజయాన్ని అందుకొని ఉండేది కాదేమోన‌ని బ‌న్నీ అన్నాడు.  ప్రతి నటుడికీ ఏదో ఒక సమయంలో ఆల్ టైమ్ రికార్డ్ వ‌స్తుంద‌ని ఆయ‌న తెలిపాడు.

అది గొప్ప మైలురాయిగా నిలుస్తుంద‌ని తెలిపాడు.  ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఏడో సినిమా  ‘ఖుషి’ ఆల్ టైమ్ రికార్డ్ గా నిలిచింద‌ని,  జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఏడో సినిమా ‘సింహాద్రి’ , రామ్ చ‌రణ్ కి  రెండో సినిమా మ‌గధీర‌ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింద‌ని తెలిపాడు. 

అందరికీ ఆల్ టైమ్ రికార్డ్ సినిమా ఉందని, అయితే, త‌న‌కెప్పుడు పడుతుందని తాను అనుకునేవాడిని చెప్పాడు. ఇందుకోసం త‌న‌కు 20 సినిమాలు పట్టిందని చెప్పాడు. అయితే,  ఇది త‌న‌ మొదటి అడుగు మాత్ర‌మేన‌ని, ఇకపై తానేంటో చూపిస్తాన‌ని తెలిపాడు.