తెలంగాణలో అమెజాన్ రూ.20,761 కోట్ల పెట్టుబడులు

పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణలో పెట్టుబడులపై కీలక ప్రకటన చేశారు. కేటీఆర్ చొరవతో ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వారి సరసన అమెజాన్ కూడా నిలిచింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో రూ.20,761 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంగీకరించిందని చెప్పారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ హైదరాబాద్ కార్యకలాపాలు 2022లో ప్రారంభం కానున్నట్లు వివరించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడుల పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.హైదరాబాద్ నగరం కొత్త మైలురాయిని అందుకుందని. తెలంగాణ చరిత్రలోనే ఇది అతిపెద్ద పెట్టుబడి అని తెలిపారు కేటీఆర్.

కాగా, నిన్న కెటిఆర్ పెట్టుబడులకు సంబంధించి మరో ప్రకటన కూడా చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన వన్‌ప్లస్ స్టోర్ హైదరాబాద్‌లో ప్రారంభమైందని అన్నారు. త్వరలోనే వన్‌ప్లస్ స్టోర్‌ను విజిట్ చేయనున్నట్లు తెలిపారు. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీదారు వన్‌ప్లస్‌ నిన్న హైదరాబాద్‌లోని హియాయత్ నగర్ లో తన అతిపెద్ద ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ను ప్రారంభించింది. దీన్ని ‘వన్‌ప్లస్‌ నిజాం ప్యాలెస్‌’ పేరుతో 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు.