‘ఏపీ రాజధాని’ వివాదంపై క్షమాపణలు చెప్పిన యాంకర్ ప్రదీప్

ఓ టీవీ కార్యక్రమంలో  ఏపీ రాజధాని విశాఖ అంటూ పేర్కొనడం పట్ల యాంకర్ ప్రదీప్ పై ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, యాంకర్ ప్రదీప్ స్పందించారు. తన సందేశంతో కూడిన ఓ వీడియో విడుదల చేశారు. తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ నొప్పించలేదని, ఎవరినీ కించపర్చాలని ఈ విధంగా చేయలేదని స్పష్టం చేశారు.

రాష్ట్రం, రాజధాని.. అనే అంశంపై టీవీ షోలో ప్రశ్నలు అడుగుతుండగా ఆ అంశం తప్పుదారి పట్టిందని పేర్కొన్నారు. వాస్తవానికి ఇలాంటి అంశాలకు తాను దూరంగా ఉంటానని, ప్రేక్షకులకు వినోదం అందించడమే తన ప్రాధాన్యత అని ప్రదీప్ వెల్లడించారు. అందుకు మీ ఆశీస్సులు కావాలి అంటూ తన సందేశాన్ని ముగించారు.