కార్మిక విప్లవ మేధావి అన్నబాహు సాటేకు ఘన నివాళులు

నిర్మల్: భైంసా పట్టణంలోని అన్నబాహు సాటే విగ్రహ కమిటి ఆధ్వర్యంలో మంగళవారం అన్నబాహు సాటే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదోల్ తాలుక కమిటీ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ ఉత్తం బాలేరావ్, ఏం అర్ పి ఎస్ జిల్లా నాయకులు శెల్కే ఆనంద్, జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు, సర్పంచ్ రమేష్, కౌన్సిలర్ సాహెబ్ రావ్, మోచి సంఘం నాయకులు సాయినాథ్ లు అన్నబాహు సాటే చిత్ర పటానికి పూలమాలలు వేసి, మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నబాహు సాటే ప్రపంచంలోనే గొప్ప సాహితీవేత్త, కార్మిక ఉద్యమ నాయకుడు అని ప్రశంసించారు. ఆయన రచించిన రచనలు దేశ విదేశాల్లో మంచి ప్రజా ఆదరణ పొందాయని తెలిపారు. బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎంతగానో కృషి చేసిన మహనీయుడు, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మైన బొంబాయి మహా నగరంలో ఒక కులానికో, మతానికో, చెందిన వారని చూడకుండా అందరి కోసం కార్మిక వర్గం కోసం అనేక పోరాటాలు చేశారు. ఇలాంటి త్యాగ మూర్తిని ప్రజలు గుర్తించాలని కొనియాడారు. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన చరిత్ర ను పాఠ్యాంశాలలో చేర్చి, జయంతి, వర్ధంతిలను అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిలింకర్ గంగాధర్, ఏ ఎం సి డైరెక్టర్, అమృత్ ఆర్మీ రిటైర్డ్, చంద్రబాన్ గణపతి, సురేఖ, దుర్పత్ బాయి, పూజారి లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.