కేంద్ర హోంమంత్రితో ఏపీ సీఎం భేటీ

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ చేరుకున్న జగన్‌.. కేంద్రమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులతో పాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం, కొవిడ్‌ సహా పలు కీలక అంశాలపై జగన్‌ చర్చించినట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు, రాజధాని వికేంద్రీకరణ విషయంలో ఇటీవల కేంద్ర హోంశాఖ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ల అంశంపైనా కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఉన్నారు. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో ఏపీ సీఎం భేటీకానున్నారు.