కరోనా వ్యాక్సిన్లపై దేశంలోని ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాసిన ఏపీ సీఎం జగన్

కరోనా వ్యాక్సిన్ల సరఫరా అంశంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు పలు రాష్ట్రాలను అసంతృప్తికి గురిచేస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాహాటంగానే తమ గళం వినిపించారు. తాజాగా, ఏపీ సీఎం జగన్ కరోనా వ్యాక్సిన్ల అంశంపై దేశంలోని అందరు సీఎంలకు లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ల సరఫరాపై ఒకే గొంతుక వినిపించాలని సీఎం జగన్ ఇతర ముఖ్యమంత్రులను కోరారు.

గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్కరూ బిడ్ వేయలేదని వెల్లడించారు. గ్లోబల్ టెండర్ల ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని లేఖలో పేర్కొన్నారు. పరిస్థితులు చూస్తుంటే వ్యాక్సిన్ లభ్యతపై కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ సరఫరాలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ పిలుపునిచ్చారు.