నలుగురు ఐఏఎస్ లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

ఏపీ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, శ్రీలక్ష్మి, విజయ్ కుమార్, గిరిజాశంకర్ లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ స్కూలు ఆవరణలో భవనాలు నిర్మించవద్దని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించలేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చినా ఎందుకు అమలు చేయడంలేదని వారిని నిలదీసింది.

కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాల ఆవరణలో భవనాల నిర్మాణం చేపట్టడంపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ కొనసాగించింది. తమ ఆదేశాలను అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం జరిగిందని ప్రశ్నించింది. ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తదుపరి విచారణకు నలుగురు ఐఏఎస్ లు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. అనంతరం విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.