ఓటరు జాబితాపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసి ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టు ఇవాళ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. కొత్త ఓటర్ల జాబితాతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరిపేలా చూడాలని కొన్నిరోజుల కిందట న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 నాటి ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించడం వల్ల కొత్తగా ఓటు హక్కు పొందిన 3.6 లక్షల మందికి అన్యాయం జరుగుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు.

దాంతో ఎస్ఈసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ… కొత్త ఓటర్ల జాబితాను అందించడంలో ప్రభుత్వం సహకరించలేదని, అందుకే తాము పాత ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోందని విన్నవించారు. అంతేకాదు, ఓటర్ల జాబితాపై ఎస్ఈసీదే తుది నిర్ణయం అవుతుందని తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 2019 నాటి ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు జరుగుతాయని పిటిషనర్లకు తేల్చిచెప్పింది.