ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. దూకుడు పెంచిన టీడీపీ

మార్చి 10 వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని టీడీపీ ప్రచారం నిర్వహిస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు. రాష్ట్రంలోని ప్రధాన కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ప్రచారం చేయబోతున్నారు. గురువారం నుంచి బాబు ప్రచారం నిర్వహించబోతున్నారు. కర్నూలు, చిత్తూరు, తిరుపతి, విశాఖ, విజయవాడ, గుంటూరులో జరిగే రోడ్డు షోలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఎలాగైనా మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన స్థానాల్లో విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ చూస్తున్నది. బాబు రంగంలోకి దిగడంతో ఆ పార్టీ నేతల్లో జోష్ పెరిగింది. దూకుడుగా ప్రచారం నిర్వహిస్తేనే విజయం సాధించేందుకు అవకాశాలు ఉంటాయని టీడీపీ నేతలు అంటున్నారు. అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని, రాష్టంలో అరాచక పాలన జరుగుతుందని, బెదిరించి అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించుకునే విధంగా చేస్తున్నారని, కష్టపడి పోరాటం చేస్తే తప్పకుండా విజయం లభిస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం నుంచి ప్రచారం చేసేందుకు బాబు సిద్ధం కావడంతో తెలుగుదేశం పార్టీ అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నది.