ఆ ప్యాకేజీకి బ్రోకర్ నువ్వేనా: యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు, కార్వేటినగరం మండల కేంద్రంలో న్యూస్ టుడే తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి ప్యాకేజీ తీసి ఇచ్చిన బ్రోకర్ నువ్వేనా అంటూ ఉపముఖ్య మంత్రి నారాయణ స్వామి మీద జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా సాధించలేని అసమర్ధ నాయకుడివి నువ్వని, ఎప్పుడు ఏమి మాట్లాడతావో అర్థం కాలేని పరిస్థితి నీదని, క్రిస్మస్ ని రంజన్ అంటావు, రంజాన్ ని క్రిస్మస్ అంటావని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి, అది ఆయన ద్వారా మాత్రమే సాధ్యమని తెలిపారు. మానవత్వానికి మారు పేరు పవన్ కళ్యాణ్, ప్రేమకు చిహ్నం పవన్ కళ్యాణ్, వాత్సల్యానికి మరొక పేరు పవన్ కళ్యాణ్ అని ఉద్భోదించారు. వ్యక్తిగత వ్యవహారాల జోలికి ఎందుకు వెళ్తావని, నీకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారన్న సంగతి నీకు తెలియదా, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. పెనుమూరు మండలంలో సర్వసభ్య సమావేశం జరిగితే, దానికి నీకు ఆహ్వానం లేదు, లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉందని తెలియజేశారు. వర్గ వైషమ్యాల్లో చిక్కుకున్న నువ్వు ఎమ్మెల్యే ఎక్కువ మినిస్టర్ కి తక్కువ, ఉపముఖ్య మంత్రికి పనికిరావని ఎద్దేవా చేశారు. ఈ నియోజకవర్గంలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఓసీలకు క్రిస్టియన్ మైనారిటీ మరియు ముస్లిం మైనారిటీ ప్రజలకు నువ్వు చేసిందేమీ లేదని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో నువ్వు ఓడిపోవడం ఖాయం, నిన్ను ఓడించడం తథ్యం, జనసేన జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.