ఆర్యవైశ్య కుల ద్రోహి వెల్లంపల్లి

  • వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ఘోర అవమానాలు
  • ఆర్యవైశ్యుల వనభోజనాలను అడ్డుకునే అధికారం వెల్లంపల్లికి ఎవరిచ్చారు?
  • పాము తాను పెట్టిన గుడ్లను తానే మింగినట్లు వెల్లంపల్లి తన సొంత సామాజిక వర్గం పైనే విషం చిమ్ముతున్నాడు
  • వెల్లంపల్లిని వైశ్య సమాజం ఎప్పుడో బహిష్కరించింది
  • వాసవీ మాత పుత్రుల ఆగ్రహం ఎలా ఉంటుందో వైసీపీకి చూపిస్తాం
  • వైసీపీ వికృత పోకడలపై నిప్పులు చెరిగిన జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

ఆర్యవైశ్య కుల ద్రోహిగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చరిత్రలో నిలిచిపోయాడని గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. వాసవీ సేవా సమితి, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం తలపెట్టిన వనభోజనాలకు అనుమతి లేదంటూ పోలీసులతో మంత్రి వెల్లంపల్లి అడ్డుకోవడం పై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఈ పరిసర ప్రాంతాల్లోనే ప్రభుత్వం నిర్వహించిన వనభోజనాలకు లేని అనుమతులు ఆర్యవైశ్యులు జరుపుకునే వన సమారాధనలకు, పూజలకు ఎందుకంటూ ధ్వజమెత్తారు. సమాజానికి మంచి చేయటం, ఆపన్నులకు, అన్నార్తులకు సేవ చేయటం మినహా అపకారం అంటే ఏమిటో ఆర్య వైశ్యులకు తెలియదన్నారు. అటువంటి వైశ్య సమాజంపై వైసీపీ ప్రభుత్వం ఎందుకు కక్ష పూరితంగా వ్యవహరిస్తుందో అర్ధం కావటం లేదన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ఘోర అవమానాలు ఎదురవుతున్నాయని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లి ఎక్కడినుంచి వచ్చాడో మరచిపోయాడంటూ దుయ్యబట్టారు. వనం విడిచిన కోతీ కులాన్ని మరిచిన మనిషి ఎందుకూ కొరగాడన్న విషయంవెల్లంపల్లి గ్రహిస్తే మంచిదని హితవు పలికారు. ఆర్యవైశ్య పితామహుడు మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎన్నో అవమానాలకు గురిచేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. చివరికి రోశయ్య పార్ధీవదేహాన్ని కూడా చూడటానికి కూడా ఇష్టపడని ముఖ్యమంత్రి నైజాన్ని, వైసీపీ నేతల దాష్టీకాన్ని ఏ ఆర్యవైశ్యుడు మరచిపోరన్నారు. ఆర్యవైశ్యులపై భౌతిక దాడులకు సైతం వైసీపీ నేతలు పాల్పడటాన్ని ప్రతీ ఆర్యవైశ్య కుటుంభం గమనిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో ఆర్యవైశ్యుల ఆగ్రహం ఎలా ఉంటుందో వైసీపీకి రుచిచూపిస్తామని నేరేళ్ళ సురేష్ అన్నారు.