స్టీల్‌ప్లాంట్‌పై అసెంబ్లీలో తీర్మానం చేయాలి: పవన్ కళ్యాణ్

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. తమ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు కార్మికులు. అటు అధికార పార్టీతో సహా ప్రతిపక్షాలు కూడా స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమంపై స్పందించారు. ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల ఆందోళనల మధ్య ఆ కార్పొరేషన్‌ ను గెలుచుకున్న వైసీపీకి 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. మరింత బాధ్యతతో వైసీపీ… స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు పవన్‌. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని రిలీజ్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి స్టీల్‌ ప్లాంటు సమస్యపై మాట్లాడాలని… అక్కడ జరుగుతున్న ఆందోళనలు-భూములు ఇచ్చిన నిర్వాసిత రైతుల ఇబ్బందులపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. 22 మంది ఎంపీలున్న వైసీపీనే..ఢిల్లీలో ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.