కోవిడ్ సెంటర్‌కు భారీ ఆర్ధిక సాయం అందించిన బాలయ్య

కరోనా కేసులు రోజు రోజుకూ వేగంగా పెరిగిపోతున్నాయి. కరోనా యాక్టివ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. దీంతో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఉపయోగించే పీపీఈ కిట్స్, మాస్కులు, ఇతర వైద్య పరికరాలు పెద్ద ఎత్తున అవసరమవుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలయ్య తన నియోజక వర్గంలో కరోనాకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని అలెర్ట్ చేస్తున్నారు. తాజాగా హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లోని కోవిడ్ సెంటర్‌కు 55 లక్షల రూపాయల విరాళం ప్రకటించి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.

ఈ మేరకు కరోనా వైరస్ నివారణకై ఉపయోగించే మందులు, కావాల్సిన పీపీఈ కిట్స్, మాస్కులు, ఇతర అన్ని పరికరాలను అందించడానికి ఈ విరాళాన్ని ప్రకటించారు బాలకృష్ణ. కాగా ఈ కల్లోల పరిస్థితుల్లో సినీ కార్మికుల కోసం ‘సీసీసీ మనకోసం’ అందించిన సాయం లోనూ భాగం పంచుకున్న బాలయ్య బాబు గతంలో 25 లక్షల విరాళం అందించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కరోనాపై పోరాటటానికి తన వంతు ఆర్థిక సాయంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు 50 లక్షల రూపాయల చొప్పున అందించారు.