భారత్ బంద్: ఏపీలో స్తంభించిన రవాణా

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల పిలుపుమేరకు శుక్రవారం భారత్‌ బంద్‌ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, వైకాపా, తెదేపా, కాంగ్రెస్‌, బీఎస్పీ, వామపక్షాలు బంద్‌కు మద్దతివ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లో బంద్‌ సంపూర్ణంగా కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జనసంచారం లేక ఆర్టీసీ బస్టాండ్లు వెలవెలబోతున్నాయి. ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రైవేటు పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.

విశాఖలో ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాలు నినాదాలు చేశాయి. మద్దిలపాలెం బస్టాండ్‌ వద్ద వామపక్షాలు ఆందోళనకు దిగాయి. గుంటూరు, కర్నూలు, అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ల వద్ద వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.