కొత్తపేటలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్షో
గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ నాయకులు విసృత్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి బీజేపీ అగ్ర నేతలు కూడా వచ్చి రాష్ట్రంలో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అంతేగాకుండా కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రచారంలో భాగంగా శుక్రవారం కొత్తపేటలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్షో నిర్వహించారు. ఈ రోడ్షోలో కొత్తపేట నుంచి నాగోల్ వరకు ప్రచారం చేశారు. జోరు వర్షంలోనూ రోడ్ షో కొనసాగుతోంది. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. హైదరాబాద్ను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ప్రతి డివిజన్లో కమలం జెండా రెపరెపలాడుతుందని చెప్పారు. ప్రజల స్పందన చూస్తుంటే కేసీఆర్ పాలనకు ముగింపులా అనిపిస్తోందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందని, ప్రజలు గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెబుతారన్నారు. గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలు వస్తున్నారని కేటీఆర్ విమర్శిస్తున్నారని వారి డ్రామాలు ఇకమీదట సాగవని జేపీ నడ్డా మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారని చెప్పారు.