ఉరవకొండ, కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఉరవకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి గౌతం కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సంక్షేమం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఉంది. అందుకు అనుగుణంగా కేటాయింపులు ఉన్నాయి. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గించే చర్యలు చేపట్టింది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పంచాయతీరాజ్ శాఖకు పెద్ద ఎత్తున నిధులను, అన్నదాత సుఖీభవ, పేదలకు ఆరోగ్య బీమా, పింఛన్ల పెంపుదల, దీపం 2 పథకాలకు నిధుల కేటాయింపుతోపాటు మిగిలిన సూపర్ సిక్స్ పథకాల హామీలను తప్పకుండా నెరవేరుస్తామని బడ్జెట్ కేటాయింపుల ద్వారా నిరూపించుకున్నామన్నారు. ‘తల్లికి వందనం’ పథకాన్ని ఈ ఏడాది మే నుంచి అమలు చేసేందుకు రూ.9,407 కోట్లను కేటాయించారు, అన్నదాతలకు భరోసానిచ్చేలా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపొందించిన ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రైతాంగానికి మేలు చేసే బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ శాఖల అధికారులకు ఈ సందర్భంగా గౌతంకుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖకు ఈ బడ్జెట్ లో రూ.18 వేల కోట్లు కేటాయించినందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్ నెట్వర్క్ పెంచే ప్రయత్నం మొదలు పెట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా 4,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రాగా, ఇప్పటికే 3 వేల కిలోమీటర్ల మేర యుద్ధప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేశారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ ని జనసేన పార్టీ పక్షాన, పవన్ కళ్యాణ్ తరఫున స్వాగతిస్తున్నాం” అన్నారు.
Share this content:
Post Comment