విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది: కేటీఆర్

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో సుదీర్ఘ సమయం పాటు సాగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. లాక్ డౌన్ మరో 10 రోజుల పాడిగించాలని ఈ క్యాబినెట్ లో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్యాబినెట్ భేటీలో తీసుకున్న ఇతర నిర్ణయాలను మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రాధాన్యత క్రమంలో ముందుగానే వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. తద్వారా వారు సురక్షితంగా ప్రయాణం చేసే వీలుంటుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలోనే వెల్లడిస్తామని వివరించారు.

అంతేగాకుండా, రాష్ట్రంలో 7 వైద్య కళాశాలల ఏర్పాటుకు క్యాబినెట్ తీర్మానం చేసిందని పేర్కొన్నారు. మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల ప్రాంతాల్లో ఈ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 2014-18 మధ్య కాలంలో తెలంగాణలో కేవలం 4 వైద్య కళాశాలలు మాత్రమే నిర్మితమయ్యాయని, కేసీఆర్ ప్రభుత్వం 5 వైద్య కళాశాలలు స్థాపించిందని, ఇప్పుడు మరో 7 నిర్మిస్తున్నామని కేటీఆర్ వివరించారు.