శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో నటులు రాగిణి, సంజనపై చార్జిషీట్

బెంగళూరు: శాండల్‌వుడ్‌లో ఇటీవల కలకలం రేపిన డ్రగ్స్‌ కేసులో నటులు రాగిణి ద్వివేది, సంజన గల్రానీతో పాటు మరో 25 మందిపై సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌, కాటన్‌పేటే పోలీసులు మంగళవారం ఎన్‌డిపిఎస్‌ కోర్టులో చార్జిషీట్‌ సమర్పించారు. గ్రడ్స్‌ వాడకం, అక్రమ రవాణా వంటి ఆరోపణలతో 2020 సెప్టెంబరు మొదటివారంలో రాగిణి, ఆ తరువాత కొన్నివారాలకు సంజనను అరెస్టు చేసి 3 నెలలకు పైగా జైల్లో ఉంచిన విషయం తెలిసిందే. ఆ తరువాత బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో వీరితో పాటు మరో 25 మందిపై డ్రగ్స్‌ ముఠాలు, వాటి దందాలకు సంబంధించి సుమారు 2,900 పేజీలతో చార్జిషీట్‌ను సమర్పించారు. 180 మంది సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. పరారీలో ఉన్న వారిపేర్లు కూడా చార్జిషీట్‌లో ప్రస్తావించారు.