కొవిడ్ కష్టకాలంలో చిరంజీవి గారి సేవలు ప్రశంసనీయం: కిషన్ రెడ్డి

కరోనావేళ మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సాటి మనిషి ప్రాణాన్ని కాపాడడం మానవత్వానికి సంబంధించిన మహోన్నతమైన సేవ అని పేర్కొన్నారు. ఈ కొవిడ్ కష్టకాలంలో చిరంజీవి, ఆయన బృందం చేస్తున్న నిస్వార్థ సేవలు ప్రశంసనీయం అని, తన మనసును కదిలించాయని తెలిపారు. ఎన్నో ప్రాణాలను కాపాడడంలో ఆయన సేవలు ఎనలేనివని కొనియాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా కిషన్ రెడ్డి పంచుకున్నారు. కాగా, చిరంజీవి సీసీసీ (కరోనా క్రైసిస్ చారిటీ) సంస్థ ఏర్పాటు చేసి టాలీవుడ్ సినీ కార్మికులను ఆదుకుంటుండడం తెలిసిందే.